1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 15 జులై 2021 (14:10 IST)

బెజ‌వాడ‌లో సంద‌డిగా బీజేపీ మ‌హిళా మోర్చా స‌మావేశం

ఎన్న‌డూ లేనంత సంద‌డిగా విజయవాడలో బీజేపీ మ‌హిళా మోర్చ సమావేశం అయింది. బిజెపి మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ లాంఛ‌నంగా ప్రారంభించారు. అంత‌కు ముందు నేత‌ల‌కు డ‌ప్పుల‌తో సంద‌డిగా స్వాగ‌తం ప‌లికారు.

మ‌హిళామోర్చా సమావేశానికి ముఖ్య అతిధిగా హజరైన జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వసతీ శ్రీనివాసన్, జాతీయ ప్రదాన కార్యదర్శి సుప్రీత్ కౌర్‌ల‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో  అతిధులుగా బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షురాలు మాలతీరాణీ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా స‌మావేశంలో పలు అంశాలపై చర్చించారు. మహిళా ఉపాధి, ఆర్దిక స్వావలంబన, మహిళలపట్ల వివక్ష, కేంద్ర ప్రభుత్వం మహిళలకోసం అమలు చేస్తున్న పధకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటంపై ప‌లువురు మ‌హిళా నేత‌లు విచారం వ్య‌క్తం చేశారు. ఏపీలో బీజేపీ ఎదుగుద‌ల‌కు మ‌హిళా మోర్చ కీల‌క పాత్ర వ‌హించాల‌ని ముఖ్య అతిథి క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ కోరారు.

కేంద్రంలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తోంద‌ని, వాటిని ఇక్క‌డ ఏపీలో ప్ర‌భుత్వం కాల‌రాస్తోంద‌ని విమ‌ర్శించారు. మోదీ ముద్ర‌ను చెరిపి, జ‌గ‌న్ త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నార‌ని మహిళా నేత‌లు ఆరోపించారు. దీనిపై ఏపీలో మ‌హిళా మోర్చ ఆధ్వ‌ర్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తామ‌ని బీజేపీ మ‌హిళా మోర్చ రాష్ట్ర అధ్య‌క్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ చెప్పారు. వివిధ ఆంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్న మ‌హిళా నేతలు ఒక నివేదిక కూడా స‌మ‌ర్పించ‌నున్నారు.