1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (16:59 IST)

ఏపీలో ఖజానా ఖాళీ.. బీజేపీ కోర్ కమిటీ ఇదే: అరుణ్ సింగ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కోర్ కమిటీని అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సత్యకుమార్‌ సభ్యులుగా ఉన్నారు. ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులను కూడా సభ్యులుగా నియమించారు. 
 
కోర్‌ కమిటీలో మధుకర్, మాధవ్, జయరాజు, చంద్రమౌళి, రేలంగి శ్రీదేవిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా శివప్రకాష్‌‌, మురళీధరణ్, సునీల్‌ దేవధర్‌ను నియమించారు.
 
ఈ సందర్భంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 1న జీతం రావడం లేదు. పింఛన్ ఇవ్వడం లేదు. ఏపీలో ఖజానా ఖాళీ అయింది. ప్రభుత్వం దివాళా తీసింది అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
 
మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.
 
సీఎం జగన్‌ను హెచ్చరిస్తున్నా.. బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను అడ్డుకునేందుకు అండగా ఉంటామని  అరుణ్ సింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించమని, వెంటనే శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులు ఉపసంహరించాలన్నారు.