శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (09:37 IST)

తెలుగుదేశం పార్టీలో చేరనున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా భీమిని అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
నిజానికి ఈ స్థానం నుంచి సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ భీమిలి నుంచి పోటీ చేస్తారని.. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఉత్తర నుంచి లోకేశ్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇపుడు కొత్తగా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. 
 
మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన లక్ష్మీ నారాయణ తన పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఆ తర్వాత పలు ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటు రాయలసీమ.. ఇటు కోస్తాఆంధ్రలో దాదాపు అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అప్పట్లో మాజీ జేడీ కొత్త పార్టీ పెడతారని పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన లోక్‌సత్తా పార్టీలో చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
అయితే, ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేదా అనే విషయంపై ఇంత వరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. సోషల్ మీడియా.. టీవీ ఛానెల్స్, వార్తాపత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకూ లక్ష్మీ నారాయణ స్పందించలేదు. అయితే మంగళవారం సాయంత్రంలోపు ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.