మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (13:48 IST)

ఎన్టీఆర్ స్మారక నాణెం రిలీజ్.. జేపీ నడ్డాతో బాబు మాటామంతీ

ntr family
స్వర్గీయ ఎన్టీ రామారావు స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆవిష్కరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. వారిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన మాటామంతీ జరిపారు. వారిద్దరూ ఏదో అంశంపై మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత నడ్డాతో ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు కూడా సమావేశమయ్యారు. 
 
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న రూ.100 స్మారక నాణెంను రాష్ట్రపతి ముర్ము రిలీజ్ చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నడ్డా, బాబులు పక్కపక్కనే కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు.
 
చంద్రబాబు పక్కన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూర్చోగా, నడ్డా పక్కన దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూర్చొన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ ఎంపీలంతా జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు, చంద్రాబు, రఘురామకృష్ణంరాజు, సీఎం రమేష్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.