శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 18 నవంబరు 2017 (20:08 IST)

కార్తీక మాసం చివరి రోజున ఈ పని చేయడం ఎంతో సంతోషం... చంద్రబాబు

పచ్చదనంతో కూడిన అమరావతి నగర నిర్మాణం భావితరాల భవిష్యత్తుకు దిక్సూచి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండలం మందడం గ్రామంలోని సీడ్ యాక్సేస్స్ రోడ్ సమీపంలో రావి, వ

పచ్చదనంతో కూడిన అమరావతి నగర నిర్మాణం భావితరాల భవిష్యత్తుకు దిక్సూచి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండలం మందడం గ్రామంలోని సీడ్ యాక్సేస్స్ రోడ్ సమీపంలో రావి, వేప కలిసిన మొక్కని నాటి నూతన చరిత్రకు నాంది పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
  
వాతావరణ సమతుల్యానికి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచవలసిన బాధ్యత తీసుకోవాలని అన్నారు. చెట్లను నాటడం ద్వారా పచ్చదనంతో నందనవనంగా అమరావతి నగరం రూపు దిద్దుకోనుందని చెప్పారు. విద్యార్ధులు దేశానికి, ప్రపంచానికి మహా శక్తి వంటి వారని, వారిలో చెట్ల పెంపకం, ప్రకృతిని కాపాడటం వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్తీక మాసం చివరి రోజున అమరావతి నగరానికి నూతన శోభ కలిగించేందుకు చెట్లను నాటడం సంతోషదాయకమని అన్నారు.
 
సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ వుండాలని ముఖ్యమంత్రి అన్నారు. “ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది” అని శ్రీ చంద్రబాబు నాయుడు అన్నారు. మనసుకు, మనిషికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి చేట్లేనని అన్నారు. అమరావతి నగరంలో 330 కిలో మీటర్ల రహదారిలో చెట్లను పెంచుతున్నామని, సుమారు 3 వేల కిలో మీటర్ల మేర సైకిల్ ట్రాక్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 9 వేల ఎకరాల్లో 5 లక్షల 50 వేల చెట్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
 
విద్యార్థులు చదువుపట్ల ఇష్టత చూపాలని అన్నారు. చదువుకునే సమయంలోనే విద్యార్ధులకు మంచి ఆలోచనలు, అలవాట్లు అలవడాలని అన్నారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్ధులకు 5 శాతం మార్కులు ఇస్తున్నట్లు చెప్పారు. మంచి సమాజం కోసం, మంచి వ్యక్తులు రావాలని ఆయన అభిలషించారు.
  
విశాఖపట్టణాన్ని అత్యంత సుందరవనంగా తీర్చి దిద్దుతున్నామని, త్వరలో తిరుపతి, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను సుందవనంగా చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని సాంకేతిక రంగాన్ని అమరావతి నగర నిర్మాణంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. శాఖమూరు పార్క్, కొండవీటి వాగు అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు  తెలిపారు. కొండవీటి వాగును భవిష్యత్తులో సుందరమైన వాగుగా చేస్తామని, ఇది అమరావతి నగరానికి మాణిక్యం కానున్నదని చెప్పారు.
 
రాష్ట్రంలో 27 శాతం పచ్చదనంతో వుందని, ఇందులో 23 శాతం అడవుల్లో ఉందన్నారు. 27 శాతంతో వున్న పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కోటి ఎకరాలలో పండ్ల తోటలను పెంచితే ఆదాయం, ఆరోగ్యం సమకూరతాయని చెప్పారు. చెట్ల పెంపకాన్ని నిరంతరం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి నగరాన్ని సుందర నగరంగా చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ఇందుకు ప్రభుత్వం తరఫున స్ఫూర్తి, కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు.
 
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ మాట్లాడుతూ,217 చదరపు కిలో మీటర్లలో నూతన రాజధాని అమరావతి ఏర్పడనున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు 75 శాతం టెండర్లు పూర్తి అయ్యాయని చెప్పారు. 18.2 కిలోమీటర్లు వున్న సీడ్ యాక్సేస్స్ రోడ్ వెంట 15 మీటర్ల వెడల్పున చెట్లను పెంచుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి తాడికొండ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో అమరావతి ప్రాంత ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును ఇచ్చిందన్నారు.