శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (10:51 IST)

విజయదశమి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి : సీఎం చంద్రబాబు

vijayadashami
విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని దుర్గమ్మను వేడుకుంటున్నట్లు చెప్పారు. దసరా.. అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే దసరా సందేశమన్నారు. 
 
ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఇదే ఒరవడితో సంక్షేమాన్ని కొనసాగిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 
అలాగే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారన్నారు. 'వైకాపా చెడుపై.. కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేల ఉద్యోగాలిచ్చే కంపెనీలను మళ్లీ రప్పించుకున్నాం. పోలవరం సాకారం కానుంది. రైల్వే జోన్‌ శంకుస్థాపన జరగనుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం చేయూతనందిస్తోంది. ఇన్ని విజయాలను అందించిన విజయ దశమిని సంతోషంగా జరుపుకొందాం' అని లోకేశ్‌ తెలిపారు.