1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (13:12 IST)

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది : ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ

chandrababu naidu
రాజమండ్రి జైలులో తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఈ జైలులోనే తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఏసీబీ జడ్జికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
 
ఈ నెల 25న రాసిన ఆ లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపించారు. ఇందులో తన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కారణాలను వివరించారు. ఈ లేఖలోని వివరాలను పరిశీలిస్తే, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న తనను జైలులోపలికి వెళుతుండగా అనధికారికంగా పోలీసులు వీడియో తీశారని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. ఆ వీడియో ఫుటేజీని స్వయంగా పోలీసులే లీక్ చేశారని, తన గౌరవాన్ని, ప్రజల్లో తనపై ఉన్న అభిమానాన్ని పోగొట్టేందుకే ఈ ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 
 
చంద్రబాబు (తన)ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని తూర్పు గోదావరి ఎస్పీకి ఇప్పటికే ఓ లేఖ కూడా వచ్చిందని చెప్పారు. అయితే, ఈ లేఖపై ఇప్పటికీ విచారణ జరిపించలేదని వివరించారు. జైలు లోపల తన కదలికలపై డ్రోన్లతో నిఘా పెడుతున్నారని, జైలు ఆవరణలో డ్రోన్లను ఎగరవేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 
 
ఓ ముద్దాయి పెన్ కెమెరాతో వీడియోలు తీస్తున్నారని, తన కుటుంబ సభ్యులతో ములాఖత్ అయినపుడు కూడా డ్రోన్లను ఎగరవేస్తున్నారని చెప్పారు. తనతో పాటు తన కుటుంబానికీ ముప్పు పొంచి ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గార్డెనింగ్ పనులు చేస్తున్న ఖైదీల వద్దకు గంజాయి ప్యాకెట్లు విసిరేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.