1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 19 జులై 2021 (14:34 IST)

పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే, వెంట‌నే అధికారులతో స‌మీక్ష‌

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఇత‌ర అధికారులున్నారు. ముందుగా సీఎం జగన్ హెలికాప్ట‌ర్ ద్వారా ఏరియల్‌ సర్వే చేసి, పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు.

అనంత‌రం అధికారులతో కలిసి సీఎం జగన్‌ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం జగన్‌ స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

అనంతరం సీఎం జగన్‌  పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌ వే పరిశీలన చేసిన అనంత‌రం సీఎం జగన్ పోల‌వ‌రం ప్రాజెక్టు అధికారుల‌తో సమీక్ష నిర్వహిస్తున్నారు. గడువులోగా పోలవరం పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
 
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత తొలిసారిగా 2019 జూన్‌ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు,  సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.

ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కారు నామినేషన్‌ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి  రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్‌ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.