బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (15:09 IST)

కరోనా భయం : ఏడడుగుల వేడుకకు ఏడుగురు అతిథులు.. ఎక్కడ?

పెళ్లంటే నూరెళ్లపంట. జీవితంలో అత్యంత మధురమైన ఈ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ తమ స్థోమతకు తగిన విధంగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటి పెళ్లిని కేవలం ఏడుగురు అతిథిల సమక్షంలో పూర్తికానిచ్చారు. ఈ వివాహ వేడుక విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం గరవపాలెం అనే గ్రామంలో. దీనికి కారణం కరోనా వైరస్ భయంతో పాటు కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమల్లోవుండటమే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గవరపాలెం తాకాశి వీధికి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తికి ఏప్రిల్ 9వ తేదీ గురువారం వివాహం జరిపేలా గతంలోనే పెద్దలు నిశ్చయంచారు. సొంతూర్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని భారీ కల్యాణ మండపం బుక్‌ చేసుకోవడమేకాక అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
ఈలోగా ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారు. దీంతో వరుడు కుటుంబ సభ్యులు ఆశలు అడియాశలయ్యాయి. పోలీసుల నిబంధన కారణంగా మండపంలో పెళ్లికే వీలుకాని పరిస్థితి.
 
అలాగని వివాహాన్ని వాయిదా వేసుకునేందుకు ఉభయ కుటుంబాలు ఇష్టపడక పోవడంతో నిరాడంబరంగా కార్యక్రమాన్ని ముగించారు. ఈ వివాహ వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మరో ముఖ్యమైన ఏడుగురు అతిథులు మాత్రమే హాజరు కావడం గమనార్హం.