గురువారం, 17 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (11:58 IST)

సీఎం చంద్రబాబుకు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత తొలగింపు!!

Chandrababu Naidu
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పటివరకూ కల్పిస్తూ వచ్చిన జడ్ ప్లస్ భద్రతను తొలగించనున్నారు. ఆ స్థానంలో సీఆర్పీఎఫ్ భద్రతను కల్పించనున్నారు. ఈ జాబితాలో చంద్రబాబుతో పాటు మరో 9 మంది హై రిస్క్ వీఐపీల జాబితాలో ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఈ వీఐపీలకు కల్పిస్తూ వచ్చిన ఎన్ఎస్ఓ కమాండోలను పూర్తిగా ఉపసంహరించుకొని, ఆ బాధ్యతలను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించనున్నారు.  వచ్చే నెలలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కొత్త బెటాలియన్ను సీఆర్పీఎఫ్‌కు కేటాయిస్తూ కేంద్ర హోమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇటీవలే పార్లమెంటు భద్రతా విధుల నుంచి ఉపసంహరించిన వీఐపీ భద్రతా విభాగాన్ని సీఆర్పీఎఫ్ 7వ బెటాలియన్‌కు కేటాయించిన విషయం తెల్సిందే. 
 
కాగా, ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ఓ) బ్లాక్ క్యాట్ కమాండోలు 'జెడ్ ప్లస్' కేటగిరీ భద్రత కల్పిస్తున్న వీఐపీలు 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, మాజీ ఉపప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ సీనియర్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు. వీరందరి భద్రతను ఇకపై సీఆర్పీఎఫ్ చూసుకోనుంది.