శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (17:18 IST)

12వ అంతస్తు నుంచి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలి : విజయసాయికి ఉమ కౌంటర్

వైకాపా నేతలకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఓ సవాల్ విసిరారు. అమరావతి ఓ గ్రాఫిక్ అంటూ వైకాపా నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా నేతలు చెప్పినట్టుగా అమరావతి ఓ గ్రాఫిక్ అయితే... వైకాపా నేతలు 12వ అంతస్తు నుంచి కిందికి దూకాలని పిలుపునిచ్చారు. 
 
వైజాగ్ రూపురేఖలు మార్చేందుకు ఓ కొత్త మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోందని, గత ప్రభుత్వంలా గ్రాఫిక్స్ చూపించకుండా, సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు దేవినేని ఉమ ఘాటుగా కౌంటరిచ్చారు. 
 
'మా నాయకుడు చంద్రబాబు ఐదేళ్లలో వైజాగ్ ఆదాయాన్ని రెండింతలు చేశారు. వైజాగ్‌ను ఐటీ, డేటా, ఫిన్‌టెక్ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు దాన్ని జగన్ ధ్వంసం చేస్తున్నాడు. ఇటీవలే మీ సహచరుడు బొత్స సందర్శించిన అమరావతిని గ్రాఫిక్స్ అంటున్న మీరు అక్కడి భవనాల 12వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి అవి గ్రాఫిక్సేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు నిరూపించకూడదు?' అంటూ ట్వీట్ చేశారు.