1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:53 IST)

సారంగ దరియా పాట వివాదం : క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తాం .. శేఖర్ కమ్ముల

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లవ్‌స్టోరీ. ఈ చిత్రంలోని పాటల్లో సారంగ దరియా అనే పేరుతో వచ్చే పాటను లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. సుద్దాల అశోక్ తేజ ఈ  పాటను రాయగా, పవన్ స్వరాలు అందించారు. మంగ్లి పాడారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. అదేసమయంలో ఈ పాటపై వివాదం కూడా చెలరేగింది.
 
అయితే, పాటను తానే వెలుగులోకి తీసుకొచ్చానని, తనతో పాడిస్తానని చెప్పి మరొకరితో పాడించారంటూ కోమలి అనే జానపద గాయని ఆరోపించడంతో ఈ పాట చుట్టూ వివాదం నెలకొంది. తాజాగా, ఈ వివాదంపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు.
 
చాలా ఏళ్ల క్రితం ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరీష అనే అమ్మాయి ఈ పాట పాడిందని, అది ఇప్పటికీ తన మనసులో అలానే ఉండడంతో ‘లవ్ స్టోరీ’కి తగ్గట్టుగా పాట రాయాలని సుద్దాల అశోక్ తేజను కోరినట్టు శేఖర్ కమ్ముల చెప్పారు. 
 
శిరీషతోనే పాటను పాడిద్దామని అనుకున్నామని, అయితే అప్పటికి ఆమె గర్భిణి కావడంతో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమెతో చర్చలు ఆపేశామని, దీనికి తోడు కరోనా కారణంగా షూటింగ్ కూడా ఆగిపోయిందని అన్నారు.
 
అయితే, ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చిన అమ్మాయి కోమలి కావడంతో ఆమెతో పాడిద్దామని సుద్దాల అన్నారని గుర్తు చేశారు. దీంతో వరంగల్ నుంచి ఆమెను రమ్మని కోరామని, అందుకు ఏర్పాటు కూడా చేశామన్నారు. అయితే, జలుబు, దగ్గు కారణంగా తాను రాలేనని కోమలి చెప్పారని తెలిపారు.
 
మరోవైపు పాట రికార్డింగ్ కోసం సంగీత దర్శకుడు అప్పటికే చెన్నై నుంచి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంగ్లీతో పాడించామని వివరించారు. తన పేరు వేస్తే అభ్యంతరం లేదని కోమలి చెప్పారని, అయితే, క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుందని సుద్దాల సూచించారన్నారు. దీనికి ఆమె కూడా అంగీకరించారన్నారు.
 
ఆడియో ఫంక్షన్‌లో పాడేందుకు కూడా కోమలి అంగీకరించారని, పాట విడుదల చేసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు కూడా చెప్పినట్టు శేఖర్ వివరించారు. కోమలికి తగిన మొత్తం ఇస్తామని, ఆడియో వేడుకకు పిలిచి గౌరవించడమే కాకుండా, ఆ పాట క్రెడిట్ కూడా ఇస్తామని తెలిపారు.