1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

పండుగ పూట విషాదం... ముగ్గులు వేస్తుండగా లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు

road accident
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు ముగ్గులు వేస్తుండగా.. అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ప్రధాన వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన తెదేపా నేత పంగిళ్ల నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అదేసమయంలో గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న ఇటుకల లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని (16) దుర్మరణం చెందగా, పల్లవీ దుర్గకు (18) గాయాలయ్యాయి. 
 
బాధితురాలిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను ప్రకాశ్‌రావుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగబాబు కుమార్తె మృతితో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కానుకొల్లుకు చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తేజస్విని, పల్లవీ దుర్గ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు.