మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (13:56 IST)

మాది రౌడీసేన కాదు.. విప్లవసేన... వైకాపా నేతలకు పవన్ కౌంటర్

pawankalyan
తమ పార్టీని రౌడీసేన అంటూ వైకాపా నేతలు చేస్తున్న ప్రచారంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గట్టిగా కౌంటరిచ్చారు. తమది రౌడీసేన కాదని విప్లవసేన అంటూ వైకాపా నేతలకు హెచ్చరించారు. సాటి ప్రజలకు, జనాలకు అన్యాయం జరుగుతుంటే తాను రోడ్లపైకి వచ్చానని అన్నారు. ఓ పద్దతి పాడూ లేకుండా అన్యాయంగా కూల్చివేస్తుంటే ప్రశ్నించేందుకే వచ్చానని తెలిపారు. 
 
ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ అధికారులు ఇళ్లు కూల్చివేసిన బాధితులకు పవన్ కల్యాణ్ రూ.లక్ష చొప్పున ఆదివారం ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రౌడీయిజం చేసేవాళ్ళకు, గూండాయిజం చేసేవాళఅలకు ఎదురు తిరగడం రౌడీయిజమేనని వైకాపా నేతలు భావిస్తున్నారన్నారు. వైకాపా నేతల వంటి దౌర్జన్యాలు చేసే వారికి రౌడీలుగా కనిపిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ప్రజల దృష్టిలో జనసైనికులు విప్లవకారులన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో మీరు నాకు ఓటు వేస్తారా లేదో తెలియదన్నారు. కానీ, మీరు ఓటు వేసినా, వేయకపోయినా ఇప్పటం గ్రామానికి, గ్రామస్థులకు ఎల్లపుడూ తాను అండగా ఉంటానని ప్రకటించారు. చెట్లు చేమలు అంతిరించాకా, ఆఖరి నీటి బొట్టు కలుషితమయ్యాక పీల్చేగాలి పూర్తిగా కలుషితమయ్యాక అపుడు నోట్ల కట్టలను తినలేమని, వేల కోట్లతో శ్వాసించలేమని వైకాపా నేతలకు తెలిసొస్తుందని పవన్ అన్నారు.