శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (07:58 IST)

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రులు కన్నబాబు, మోపిదేవి, శంకర్ నారాయణ

పంట చేతికి రాకుండానే వేల కోట్ల నష్టం వాటిల్లిందంటూ  ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, మాలగుండ్ల శంకర్ నారాయణలు ఖండించారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రులు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివని మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వేరుశెనగ పంట రైతు నుంచి మార్కెట్ లోకి రాకముందే రూ.3 వేల కోట్లు, మొక్కజొన్న పంటలో రూ.600 కోట్లు నష్టం వాటిల్లిందని చేస్తున్న అబద్ధపు ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

ఇప్పటికే రూ.3 వేల ధరల స్థిరీకరణ నిధి ద్వారా టమాట, ఆయిల్ ఫాం, సుబాబుల్, వేరుశెనగ, మొక్కజొన్న, ఉల్లి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసాను అమలు చేస్తున్నారని తెలిపారు.

తొలిసారిగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు. అవినీతికి తావు లేకుండా రైతు ఖాతాలోనే నేరుగా పెట్టుబడి సాయం జమ అవుతుందన్నారు. రైతు భరోసా పథకంపై సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులతో పాటు దేవాదాయ శాఖ భూములను కౌలుకు పండించుకుంటున్న వారికి పెట్టుబడి సాయం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా ద్వారా 45 లక్షల 20 వేల 616 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఇంకా లక్షా 20 వేల రైతు కుటుంబాల వివరాలు నమోదవ్వాల్సి ఉందన్నారు.

డిసెంబర్ 15వ తేదీలోగా వారు తమ వివరాలు నమోదు చేసుకుంటే రైతు భరోసా అందిస్తామన్నారు. రైతులకు ఎక్కడ మద్దతు ధరకు ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వేరుశెనగ, మొక్కజొన్నపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం అర్థం లేనిదన్నారు.

మొక్కజొన్న కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్క జొన్న రైతులకు బోనస్‌ ఇవ్వకుండా మోసం చేసిన గతంలో మోసం చేసిన గత ప్రభుత్వ పాలకులు  నేడు పచ్చి అబద్ధాలను ట్వీట్‌ చేస్తున్నారని విమర్శించారు.