శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (18:40 IST)

అసని తుఫాన్: కాకినాడ, విశాఖ పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్

cyclone
అసని తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ అయింది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. 
 
మత్స్యకారులు ఎవరూ రేపటి వరకు (మే 12) సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు దెబ్బతినగా కొన్నిచోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అరటి తోటలు, బొప్పాయి తోటలు, వరి పంట బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తింది. 
 
'అసని' తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడినట్లు వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్టులో వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తుఫాన్ కదిలినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం మచిలీపట్నంకు ఆగ్నేయంగా 60కి.మీ దూరంలో, కాకినాడకు దక్షిణ నైరుతి దిశగా 180కి.మీ దూరంలో, విశాఖపట్నంకు నైరుతి దిశగా 310 కి.మీ దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్ 550 కి.మీ దూరంలో, పూరికి 660 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖవెల్లడించింది.