1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (09:10 IST)

సెంటు భూమిలో ఇల్లు ఎలా సాధ్యం?: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్లపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దని  హైకోర్టు ఆదేశించింది. పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలాన్ని కేటాయించడాన్ని హైకోర్టు  తప్పుపట్టింది.

గృహ నిర్మాణంపై ఏపీ హైకోర్టును 128 మంది పిటిషనర్లు ఆశ్రయించారు. 108 పేజీల తీర్పును హైకోర్టు వెల్లడించింది. గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మూడు జీవోలలోని పలు నిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని హైకోర్టు వెల్లడించింది. 
 
ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చారు.

ఇళ్ల స్థలాల విస్తీర్ణంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి.. ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది. ఆ తర్వాతే ఈ పథకాన్ని ఖరారు చేయాలని స్పష్టంచేసింది.
 
హైకోర్టు తీర్పు హర్షణీయం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని, అగ్ని ప్రమాదాలు, ఆరోగ్య, మంచినీటి తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ ముందు నుండే డిమాండ్ చేయటం గమనార్హం.
 
సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.1,80,000 ఏమాత్రం సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు నివాసయోగ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలి లేదా రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలి.