గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (10:57 IST)

హుజుర్ నగర్ బై పోల్ : నేటితో నామినేషన్లపర్వానికి తెర

తెలంగాణ రాష్ట్రంలోని హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 21వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వానికి సోమవారంతో తెరపడనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా సోమవారమే నామినేషన్ దాఖలు చేయనున్నారు.
 
ముఖ్యంగా, అధికార తెరాస, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ స్వీకరించే తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమ అనుచరులతో ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేయనున్నారు.
 
ఈ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి నామినేషన్‌కు మంత్రులు జగదీష్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి హాజరవుతారు. కాంగ్రెస్‌ అభర్థి పద్మావతి నామినేషన్‌కు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హాజరవుతారు. జీజేపీ అభ్యర్థి కోటా రామారావు నామినేషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హాజరుకానున్నారు. కాగా, ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబరు 21వ తేదీన జరుగనుండగా, అక్టోబరు 24వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు.