శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (07:04 IST)

నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు మీరిస్తారా.. మేమివ్వాలా?: సీపీఐ

గత ప్రభుత్వం టిడ్కో ద్వారా పేదల కోసం నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు కేటా యించాలని, జాప్యం చేస్తే తామే ఆక్రమించి డిపాజిట్‌ కట్టినవారికి అప్పగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు.

పేదల కోసం విజయవాడ నగరంలోని జక్కంపూడి, షాబాద్‌, వేమవరం ప్రాంతాల్లో టిడ్కో ద్వారా నిర్మించిన గృహసముదాయాలను కె.రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, పలువురు నాయకులతో కూడిన బృందం పరిశీలించింది.

ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాపితంగా ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని, లబ్ధిదారులను ఎంపిక చేసి డిపాజిట్లు కట్టించుకుందని తెలిపారు. చాలా ప్రాంతాల్లో 90శాతం మేర ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిందన్నారు.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయడం తగదని, 16 నెలలు గడిచినా ఒక్క ఇంటిని కూడా ప్రజలకు పంపిణీ చేయకపోవడం దుర్మార్గమన్నారు.

పేదలకు పంపిణీ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం 43 వేల ఎకరాలు సేకరించిందని, కానీ, కోర్టులో కేసులున్నాయన్న నెపంతో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు.

నిర్మాణం తుది దశలో ఉన్న టిడ్కో ఇళ్లకు తుది మెరుగులు దిద్ది డిపాజిట్లు కట్టిన వారందరికీ ప్రభుత్వం తక్షణం పంపిణీ చేయాలని డిమాండు చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 14 నుంచి రాష్ట్ర వ్యాపితంగా లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి అర్హుల వివరాలు తీసుకుంటామని, 20వ తేదీ నుంచి సంబంధిత ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఆక్రమిస్తామని స్పష్టం చేశారు.

ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని కోరారు. అక్కినేని వనజ మాట్లాడుతూ మహిళల పేరుతో ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం…ఆచరణలో పూర్తిగా విఫలమైందన్నారు.

దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ పక్కా ఇళ్లు వస్తాయన్న గంపెడాశతో పేద, మధ్య తరగతి ప్రజలు అప్పు చేసి మరీ రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్లు చెల్లించారని, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయకపోవడంతో తమకు ఇళ్లు వస్తాయో.. రావో.. అన్న బెంగతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.