1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (19:50 IST)

2021-22లో ప్రాధాన్యతా రంగంలో..రూ.2.31లక్షల కోట్ల ఋణాలు: నాబార్డు అంచ‌నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వివిధ రంగాల్లో పలు బ్యాంకుల ద్వారా ప్రాధాన్యతా రంగంలో రూ.2లక్షల 31వేల కోట్ల ఋణ సహాయం అందించేందుకు అవకాశాలు ఉన్నాయని నాబార్డు (జాతీయ గ్రామీణ వ్యవసాయాభి వృద్ధి బ్యాంకు) రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్-2021-22ను బట్టి వెల్లడైంది.

శుక్రవారం అమరావతి సచివాలయంలో నాబార్డు ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్-2021-22 జరిగింది. ఈ ఫోకస్ పేపర్ ప్రకారం రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో బ్యాంకుల ద్వారా 2లక్షల 31వేల 238.76 కోట్ల రూపాయలు ఋణం సహాయం అందించేందుకు అవకాశం ఉందని నాబార్డు అంచనా వేసింది. దీనిలో వ్యవసాయ రంగానికి లక్షా 57వేల 642 కోట్లు ఋణాలు అందించేందుకు అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

అలాగే ఎంఎస్ఎంఇ రంగానికి 47వేల 402కోట్లు,ఎక్స్పోర్టు క్రెడిట్ కింద 2వేల 880 కోట్లు,విద్యా రంగంలో 1584కోట్లు,గృహ నిర్మాణ రంగానికి 14వేల 335 కోట్లు,రెన్యువల్ ఎనర్జీకి 461 కోట్లు,సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ బ్యాంకు క్రెడిట్ కింద 513 కోట్లు,ఇతర రంగాల్లో 6వేల418  కోట్లు ఋణాలు అందించేందుకు అవకాశం ఉన్నట్టు నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ 2021-22లో ప్రొజెక్టర్ చేయడం జరిగింది.

ఈ స్టేట్ ఫోకస్ పేపరును రిఫరెన్సు డాక్యుమెంట్ గా చేసుకుని రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ(SLBC)2021-22 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల వార్షిక ఋణ ప్రణాళిక(Annual Credit Plan)ను రూపొందించనుంది. ఈ సందర్భంగా స్టేట్ ఫోకస్ పేపర్ 2021-22ను మంత్రి కన్నబాబు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ లు ఆవిష్కరించారు.

అనంతరం వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... ప్రాధమిక రంగాల అభివృద్ధితోపాటు రైతుల ఆర్థిక ప్రయోజనాలు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు.ఈ ప్రాధాన్యత లక్ష్యాల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి సంబంధించి వైస్సార్ బీమా పధకం,వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు,కష్టమ్ హైరింగ్ కేంద్రాలు వంటి వివిధ పథకాలను అమలు చేస్తోందని ఆయా పధకాలకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలన విజ్ణప్తి చేశారు.

అలాగే ఆహారశుద్ధి పరిశ్రమల రంగంలోను కౌలు రైతులకు రుణాలను అందించడంలోను ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ణప్తి చేశారు.జనతా బజార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అందుకు కూడా బ్యాంకులు తగిన విధంగా తోడ్పాటును అందించాలన్నారు.అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ రిటైల్ చైన్ అభివృద్ధి చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉందని అందుకు బ్యాంకులు తగిన తోడ్పాటును ఇవ్వాలని మంత్రి సూచించారు.

గ్రామ స్థాయిలో వ్యావసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో మౌళిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని దానికి బ్యాంకులు సహకరించాలని కోరారు.అదే విధంగా పాడిపరిశ్రమాభివృద్ధి రంగంలో కూడా రైతులకు తగిన తోడ్పాటును అందించాలని,ముఖ్యంగా కౌలు రైతులకు సహాయం అందించడంలో మానవతా ధృక్పదంతో వ్యవహరించి తగిన సహాయం అందించి వారిని ఆదుకోవాలని విజ్ణప్తి చేశారు.

నాబార్డు రాష్ట్ర ప్రగతికి ఎంతగానో సహాయ పడుతుందోని ఇందుకుగాను నాబార్డు చైర్మన్ గోవింద రాజులుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రం వివిధ రంగాల్లో అభివృద్ధికి వివిధ బ్యాంకులు మరియు నాబార్డు అందిస్తున్న తోడ్పాటును ప్రత్యేకంగా కొనియాడారు.నాబార్డు కేవలం వ్యవసాయ రంగానికే కాక విద్య వైద్య రంగాల్లో కూడా మంచి తోడ్పాటును అందించడంతోపాటు నీటిపారుదల రంగానికి తగిన సహాయం అందించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక అభినందలు తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపట్టిన వివిధ పధకాల అమలుకు బ్యాంకులు,నాబార్డు మరింత సానుకూల దృక్పదంతో ముందుకు రావాలని సిఎస్ ఆకాంక్షించారు.2021-22 ఆర్ధిక సంవత్సరానికి నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు. 

నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ జొన్నావర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో నాబార్డు ద్వారా 27వేల 992 కోట్ల రూ.లు సహాయం అందించాల్సి ఉండగా లక్ష్యాన్ని మించి 32వేల కోట్ల రూ.లు అందించడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వ లక్ష్యాలు ఆశయాలకు అనుగుణంగా ఆయా పధకాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు నాబార్డు తమవంతు తోడ్పాటును అందిస్తోందని పేర్కొన్నారు.రాష్ట్రంలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికంటే 9శాతం అధికంగా ప్రాధాన్యతా రంగంలో ఋణ సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా స్టేట్ ఫోకస్ పేపరును రూపొందించినట్టు తెలిపారు.

రానున్నఆర్ధిక సంవత్సరంలో 2లక్షల 31వేల కోట్ల రూ.లు ఋణాలు అందించేందుకు అవకాశం ఉన్నట్టు అంచనా వేయగా దానిలో 68 శాతం ఒక్క వ్యవసాయ రంగంలోనే ఋణాలించేందుకు వీలుందన పేర్కొన్నారు.దానిలో వ్యవసాయ టెర్మ్ ఋణాలకు 31వేల కోట్లు,వ్యవసాయ మౌళిక సదుపాయాలు,ఇతర యాన్సిలరీ కార్యక్రమాలకు 12వేల 716 కోట్లు ఋణ సౌకర్యానికి వీలుందని సుధీర్ కుమార్ జొన్నావర్ తెలిపారు.

సమావేశంలో నాబార్డు జనరల్ మేనేజర్ బి ఉదయ భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరించారు.

సమావేశంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుందరం శంకర్,సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సునీత,స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ,స్పెషల్ సెక్రటరీ మదుసూధన రెడ్డి, రిజిష్ట్రార్ ఆఫ్ కోపరేటివ్స్ బాబు ఎ తదితరులు మట్లాడారు.ఇంకా ఈసమావేశంలో పలువురు అధికారులు,ఆర్బీఐ,ఇతర బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.