1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2023 (16:26 IST)

ఎలక్షన్ టైమ్... ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఆ పరిమితి పెంపు!!

arogyasri
వచ్చే యేడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైకాపాకు ఓటమి తప్పదనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ముఖ్యంగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇటు సంక్షేమంతో పాటు అటు అభివృద్ధి చేసిన అధికార భారత రాష్ట్ర సమితి పార్టీకి ఓడిపోయింది. దీంతో గత నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి అనేది ఏపీలో మచ్చుకైనా కనిపించడం లేదు. పైగా, ఒక్క రోడ్డు కూడా సక్రమంగా లేదు. దీంతో ఏపీలో వైకాపా చిత్తుగా ఓడిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా సీఎం జగన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆరోగ్య శ్రీ ఉండాలన్న సంకల్పంతో ఈ పథకం కింద వైద్య ఖర్చును రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ రోజు నుంచి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని జగన్ చెప్పారు. క్యూఆర్ కోడ్ కలిగిన ఈ కార్డులో లబ్దిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు ఉంటాయన్నారు. 
 
రాష్ట్రంలో 1.45 కోట్ల మందిని ఈ పథకం కిందకు తీసుకొస్తామని చెప్పారు. ప్రతి ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌లు ఉండాలని సూచించారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్ పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. కేన్సర్ వంటి వ్యాధులకు కూడా ఆరోగ్య శ్రీని వర్తింపజేశామని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కోసం యేటా రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, కానీ తమ ప్రభుత్వం ఏకంగా రూ.4100 కోట్లు ఖర్చు చేసిందని సీఎం జగన్ చెప్పారు.