1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 3 డిశెంబరు 2021 (14:40 IST)

ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉద్యోగుల నిరసన దీక్షకు జనసేన మద్దతు

ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉద్యోగులు చేస్తున్ననిరసన దీక్షకు జనసేన పార్టీ మద్దతు పలికింది. జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ యూనివ‌ర్సిటీకి వెళ్ళి మ‌ద్ద‌తు తెలిపారు. నిధుల మ‌ళ్ళింపుతో యూనివర్సిటీ భవిష్యత్తు శూన్యం అవుతుంద‌ని, మనుగడ ప్రశ్నార్థకం కాక తప్పద‌ని పోతిన వెంకట మహేష్ అన్నారు.
 
 
రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ మెయింటెనెన్స్ ఖర్చులకు మీరే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించక తప్పద‌ని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అనుమతి లేకపోయినా, ఛాన్స్లర్ అంటే గవర్నర్ ఆమోదం లేకపోయినా, ఎన్టీఆర్ యూనివర్సిటీ నిధులు 440 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు బదలాయించడం దుర్మార్గం అన్నారు.
 
 
అడిగిన నిధులు కంటే ఎక్కువగా నిధులు మళ్లించిన వైస్ ఛాన్స్లర్ శ్యామ్ సుందర్ ముఖర్జీ ఏమి ఆశించి ఈ పని చేశారు సమాధానం చెప్పాల‌ని జ‌న‌సేన నేత‌లు డిమాండు చేశారు. జాతీయ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే, భద్రత ఉంటుంద‌ని, వడ్డీ స్థిరంగా వస్తుంద‌న్నారు. ఒక దొంగ దగ్గర ఎవరూ డబ్బులు దాచుకోరు అని జ‌న‌సేన నేత ఎద్దేవా చేశారు.