1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 2 డిశెంబరు 2021 (16:14 IST)

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ నిధుల బద‌లాయింపుపై ర‌చ్చ‌

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిధులు 400 కోట్ల రూపాయలను ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బదలాయించిన విష‌యం ఇపుడు ర‌చ్చ అవుతోంది. పాలక మండలి ద్వారా తీర్మానం చేసి నిధులు వెనక్కి రప్పించాలని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్ కు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ  ఎస్ యూ) నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. నిధులు వెనక్కి రప్పించాలని గత రెండు రోజుల నుండి ఉద్యోగులు, సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన నిర్వహిస్తున్నారు. వారి ఆందోళనకు పీ డీ ఎస్ యూ నాయకులు మద్దతు తెలియజేశారు.

 
పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎ.రవిచంద్ర మాట్లాడుతూ, ఆరోగ్య విశ్వవిద్యాలయం పాలక మండలి తీర్మానం చేయకుండానే  వైస్ చాన్సలర్, రిజిస్టార్ లను బెదిరించి స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది అన్నారు. విశ్వవిద్యాలయ నిధులు తీసుకోబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన 24 గంటల లోపే రాష్ట్ర ప్రభుత్వం నిధుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేసిందని తెలిపారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిజరూపం బహిర్గతమైందని దుయ్యబట్టారు. ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్,వైద్య కళాశాలల అభివృద్ధి దీని ద్వారా కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల నుండి ఉద్యోగులు సిబ్బంది ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. 
 
 
విశ్వవిద్యాలయం పాలక మండలి సమావేశం తక్షణమే నిర్వహించాలని వైస్ ఛాన్సలర్ని కోరారు. దీనిలో విశ్వవిద్యాలయ నిధులు  వెనక్కి  ఇవ్వాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని వైస్ ఛాన్సలర్ ను కోరారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నానితో గురువారం జరిగే సమావేశంలో తప్పకుండా తెలియజేస్తానని వైస్ ఛాన్సలర్ శ్యాం ప్రసాద్ పీ డీ ఎస్  యూ నాయకులకు హామీ ఇచ్చారు. పీ  డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎ.రవిచంద్ర, నగర అధ్యక్షులు ఐ. రాజేష్ వినతి పత్రం అందజేశారు.