1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:05 IST)

ద‌స‌రా రాష్ట్ర ఉత్సవంలా లేదు... వైసీపీ ఉత్సవంలా రంగులేసారు...

బెజ‌వాడ‌లో క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో నిర్వ‌హిస్తున్న ద‌స‌రా ఉత్స‌వాలు రాష్ట్ర ఉత్స‌వంలా క‌నిపించ‌డం లేద‌ని జ‌న‌సేన విజయవాడ అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమ‌ర్శించారు. తాము దర్శనానికి రెండో రోజు కూడా వచ్చామ‌ని, ప్రముఖులు, తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇక్క‌డ ప్రాధాన్యం ఇస్తున్నార‌న్నారు. 
 
దసరా ఉత్సవాలలో పనులు చేసేవారికి సదుపాయాలు లేవ‌ని,  దసరా రాష్ట్ర ఉత్సవం అయితే బడ్జెట్ ఎంత, అస‌లు ఇది ఇది రాష్ట్ర ఉత్సవమేనా అని ప్ర‌శ్నించారు. 70 కోట్ల నిధులు ఎందుకు ఇంకా అమ్మవారి ఖాతాకి రాలేద‌ని, అందుకే ఇది రాష్ట్ర ఉత్సవంలా లేద‌ని, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్సవంలా రంగులేసార‌ని విమ‌ర్శించారు. 
 
దుర్గ‌గుడిపై అన్యమత ప్రచారం‌ వైసీపీ నాయకులే నిన్న చేయించార‌ని, ఆలయం ఏర్పాటు చేసిన స్క్రీన్స్ లో ఎలా అన్యమత ప్రచారం వచ్చింద‌ని ప్ర‌శ్నించారు. స్క్రీన్స్ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల‌ని, అక్క‌డ ప‌నిచేసే నలుగురు ఈఈ లు, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇతర ఆలయాల ఈఓ లను నలుగురిని ఇక్క‌డికి తీసుకొచ్చార‌ని, అయినా ఉత్సవ శోభ ఏమైంది... ఐరన్ ఫ్రేం ఏమైంది? మామిడి తోరణాలు కూడా లేవు...ఇది ఆధ్యాత్మిక కేంద్రమా... వ్యాపార కేంద్రమా అని విమ‌ర్శించారు. 
 
ఏపీ సీఎం జ‌గ‌న్ పట్టువస్త్రాలు సమర్పించే నాటికైనా ఇవన్నీ సరి చేయాల‌ని సూచించారు. ఒక వ్యక్తి ఆలయంలో క‌రెంటు షాక్ తో చ‌నిపోతే సంప్రోక్షణ ఎందుకు జరగలేద‌ని ప్ర‌శ్నించారు. జ‌నసేన ఎప్పుడూ అమ్మవారికి కాపలాదారుగా ఉంటుంద‌ని, అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు సవ్యంగా పూర్తి చేయాల‌ని జ‌న‌సేన నాయ‌కుడు పోతిన మ‌హేష్ సూచించారు.