శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (15:33 IST)

సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది : వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని

kodali nani
తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అందువల్లే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోలు, ర్యాలీలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైకాపా మాజీ మంత్రి, గుడివాడి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 
 
గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా పలు చోట్ల అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన రోడ్‌షో, గుంటూరులో జరిగిన జనతా వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ వరుస సంఘటనల నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం పోలీస్ యాక్ట్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, చంద్రబాబు నాయుడు సభలకు ప్రజలు ఇసుకేస్తే రానంతగా రావడం, తొక్కిసలాట ఘటనపై వైకాపా నేతలు తోలో రకంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కొడాలి నాని మాట్లాడుతూ, తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఆ కారణంగానే చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు.