1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (09:12 IST)

చంద్రబాబుతో సూర్య భేటీ.. సైకిలెక్కేందుకు మెలిక పెట్టిన కోట్ల ఫ్యామిలీ

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోమవారం రాత్రి భేటీ అయ్యారు. డిన్నర్ మీట్‌లో వీరిద్దరూ సమావేశమై గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. ఆ సమయంలో కోట్ల భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య పార్టీలో చేరే విషయంపై చర్చ జరిగింది. 
 
ముఖ్యంగా, తాము పార్టీలో చేరితే కర్నూలు ఎంపీ, డోన్, ఆలూరు, కోడుమూరు అసెంబ్లీ స్థానాలు కావాలంటూ కోట్ల కుటుంబం ప్రతిపాదించింది. కర్నూలు ఎంపీ టికెట్‌ ఇచ్చే అంశంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు... అసెంబ్లీ సెగ్మంట్ల విషయమై కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో చర్చించాకే స్పష్టత ఇస్తానని స్పష్టంచేసినట్టు వినికిడి. 
 
మరోవైపు, పార్టీలో చేరేందుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కొన్ని మెలికలు పెట్టినట్టు తెలుస్తోంది. వేదవతి, గుండ్రేవుల, హోస్పేట్ నుంచి కర్నూలు వరకు పైపు లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితే టీడీపీతో చేరతానని తెగేసి చెప్పినట్టు సమాచారం. 
 
సీఎంతో భేటీ అనంతరం కోట్ల మాట్లాడుతూ వారం రోజుల్లోగా కర్నూలు జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ వస్తుందన్నారు. ఆ తర్వాతే పార్టీలో చేరతానని చెప్పారు. తాను కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తానని వెల్లడించారు. 
 
ఏపీ నేతల్ని అడగకుండానే తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకుందన్నారు. టీడీపీతో పొత్తుల్లే ఏపీ కాంగ్రెస్ క్యాడర్‌లో భయం ఏర్పడిందన్నారు. పొత్తుల్లేకుండా వెళ్లడంసబబు కాదని హైకమాండ్‌ దృష్టికి కూడా తీసుకెళితే, వారు తన మాటను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.