1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (13:18 IST)

ఆగిరిప‌ల్లిలో వైభ‌వంగా మహబూబ్ సుభాని ఉరుసు మ‌హోత్స‌వం

కృష్ణా జిల్లా ఆగిరిప‌ల్లిలో ఉరుసు మ‌హోత్స‌వం వైభవంగా జ‌రిగింది. మ‌త పెద్ద‌లు గంధంతో ఊరేగింపుగా  బయలుదేరి, మహబూబ్ సుభాని ఉరుసు గంధం మహోత్సవంలో పాల్గొన్నారు. ఆగిరిపల్లి హైస్కూల్ రోడ్లోని హజరత్ మహబూబ్ సుభాని దర్గా నిషాని వద్ద మహబూబ్ సుభాని ఉరుసు, గంధ మహోత్సవం వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.
 
 
దర్గాలోని మహబూబ్ సుభానినీ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజించారు. దర్గా నుండి ఉరుసు గంధంతో బయలుదేరిన వాహనం ముందు మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో పెద్ద ఎత్తున ముందు గుండు సామాగ్రి కాల్చుకుంటూ గ్రామంలోని నాలుగు ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గంధం తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఆగిరిపల్లి పుర వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. 
 
 
ఎస్ఎస్ పబ్లిషర్స్ యజమాని షేక్ షాజహాన్ నేతృత్వంలో దర్గా కమిటీ సభ్యులు, ముజావర్ పటాన్ బి బి జాన్, పఠాన్ సుభాని పర్యవేక్షణలో ఉరుసు, గంధ మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మ‌త సామ‌ర‌స్యాన్ని అల‌వ‌రుచుకున్న ఆగిరిప‌ల్లి వాసులు అంద‌రూ, మ‌తాత‌ల‌కు అతీతంగా ఈ ఉరుసు ఉత్స‌వంలో పాల్గొన‌డం విశేషం.