1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అర్థరాత్రి హైడ్రామా : టీడీపీ నేత దేవినేని అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే ఠాణాకు తరలించారు. 
 
తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవినేని ఉమా ఇతర నేతలతో కలిసి జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు ఆరుగంటల పాటు దేవినేని ఉమా తన కారులో కూర్చొని ఆందోళన చేపట్టారు. 
 
దీంతో అర్ధరాత్రి తర్వాత వాహనం అద్దాలు తొలగించి దేవినేనిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం తమ వాహనంలో దేవినేనిని ఎక్కించుకొని స్టేషన్‌కు తరలించారు.   
 
కాగా, మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైకాపా వర్గీయులు మంగళవారం రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద  వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. 
 
వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. 
 
ఈ ఘటనపై రాష్ట్ర డీఐజీ మోహన్ రావు స్పందించారు. దేవినేని ఉమా ఉద్దేశ పూర్వకంగా జి.కొండూరులో అలజడి సృష్టించారని ఆరోపించారు. దేవినేని ఉమా చర్యలపై ఫిర్యాదు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఉమాను అరెస్ట్‌ చేశామని, వంద శాతం పారదర్శకంగా విచారిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.