1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (19:19 IST)

సంప్రదాయ క్రీడలను కూడా పచ్చ కళ్ళతో చూస్తారా?.

రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కన్నబాబు  ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలు సంక్రాంతి సందర్భంగా జరుపుకునే క్రీడలను పచ్చ కళ్ళతో చూడవద్దని  తెలుగుదేశానికి, ఎల్లో మీడియాకు ఉద్బోధ చేసారు.


సోమవారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, జల్లికట్టు, కోడి పందేలు సంక్రాంతి ఆంధ్రప్రదేశ్  సంప్రదాయ క్రీడలు అని స్పష్టం చేశారు. ఇది ప్రజల పండుగ, వాళ్ళ అభిష్టం మేరకు  పండుగలు జరుగుతాయి! వీటిని ఆపే శక్తి ఏ ప్రభుత్వాలకు లేదన్నారు. సంప్రదాయ పండుగలను కూడ తమ స్వార్థం కోసం రాజకీయం చేయడం ఈ పచ్చ పత్రికలు, ప్రతిపక్ష పార్టీలకు చెల్లింది అని మంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఇవి సంప్రదాయ క్రీడలని ,
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఇవి జూద క్రీడలు అని వీళ్ళు మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి పండుగల్లో స్పందించే ముందు మీ పార్టీ నాయకుల అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని మాట్లాడమని హితవు పలికారు.

 
మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడి ఉంటే క్యాసినో నిర్వహించారని పచ్చ మీడియా గగ్గోలు పెడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి పండుగను సంప్రదాయ బద్దంగా జరుపుకున్నారని తెలియచేస్తూ, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంపదాయాలను మీ రాజకీయ లబ్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా హేళన చేయడం మీకే చెల్లిందన్నారు. మొన్న చిరంజీవి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలసిన విషయాన్ని కూడా రాజకీయ విషమయం చేసిన ఘనత టిడిపి, కమ్యూనిస్టు నాయకులు నారాయణ, పచ్చ పత్రికలకు మాత్రమే దక్కిందన్నారు.
రైతులకు ఆంధ్రప్రదేశ్ అండగా ఉండటంతో ముందుందని కేంద్రం కితాబు ఇస్తే, ఇక్కడ పదహారు వేల కోట్లు నష్టంలో ఉన్నారని పచ్చ పత్రికలలో వచ్చిన వార్త వెనుక దురుద్ధేశం ఉందని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.

 
దయచేసి రాష్ట్రంలో నిజమైన వార్తలు రాయాలి కానీ చంద్రబాబు జేబు పత్రికల తయారై, వాస్తవ విరుద్ధంగా కధనాలు ప్రచురించవద్దని  పిలుపు ఇచ్చారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఆ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకున్న విషయం గుర్తు చేసారు.
రైతు కొనుగోలు కేంద్రాలు ద్వారా పండించిన పంట నేరుగా కొనుగోలు చేస్తోందన్నారు.


గోదావరి డెల్టాలో నీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి ముందుగానే వేయమని  పంటలు వేసుకోమని రైతులకు తెలిపాం అని మంత్రి తెలిపారు. అలాగే రైతులకు ఉచితంగా లక్ష విత్తనాలు కిట్లు పంపిణీ చేసామని, గులాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇరవై రెండు కోట్ల చెల్లింపు చేసామని తెలుపుతూ, వైఎస్సార్ భీమా 1732కోట్లు చెల్లింపు చేసామని మంత్రి కన్నబాబు తెలిపారు.ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, పచ్చ పత్రికలు అబద్ధాలు ప్రచారం మానుకుని, నిజాలు ప్రజలకు తెలియచేయాలని పిలుపు ఇచ్చారు.