శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (17:52 IST)

వైయస్ఆర్ నేతన్న నేస్తం రెండో విడత పంపిణి ప్రారంభించిన మంత్రి మేకపాటి

చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశ్యమని, ఆ క్రమంలోనే ప్రతి ఒక్క చేనేత కార్మికుడికీ నేతన్న నేస్తం అందచేసేందుకు రెండో విడత పంపిణీకి మార్గం సుగమం చేసారని పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. వైయస్ఆర్ నేతన్న నేస్తం 2020-21 రెండో విడత పంపిణి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  8903 మంది లబ్ధిదారులకు బుధవారం రూ.21.37 కోట్లను మంత్రి విడుదల చేసారు.
 
ఈ సందర్భంగా అటు అధికారులతోనూ, ఇటు చేనేత కార్మికులతోనూ వీడియో కాన్సరెన్స్ ద్వారా మేకపాటి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ నేత కార్మికులకు విస్రృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించే క్రమంలో ఇప్పటికే “ఆప్కోహ్యండ్ లూమ్స్.కామ్” పేరిట ఈ పోర్టల్ ప్రారంభించామని, అమెజాన్, మింత్రా వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుని అంతర్జాతీయ విపణిలో చేనేత వస్త్రాలు విక్రయం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.
 
నేతన్న నేస్తo పథకంలో స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కార్మికుని కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేలు ఆర్ధిక సహాయం చేస్తుండగా, కార్మికులు వారి మగ్గాలను ఆధునీకరించి పవర్ లూమ్ పరిశ్రమకు గట్టి పోటీని ఇవ్వగలుగుతున్నారన్నారు. జీవన భృతి కోసం చేనేత వృత్తిపై ఆధారపడి ప్రస్తుతం అదే వృత్తిలో కొనసాగుతూ పేదరిక రేఖ దిగువన ఉన్న వారినే అర్హులుగా నిర్ణయించామన్నారు.
 
2019-20 సంవత్సరంలో 81,783 లబ్దిదారులు దీని ద్వారా లబ్ది పొందగా, ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయటం ద్వారా అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పథకం అమలుకు 2020-21 సంవత్సరానికి గాను మొదటి విడతగా రూ.194.46 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని చేనేత జౌళి శాఖ సంచాలకులు డాక్టర్ బిఆర్ అంబేత్కర్ తెలిపారు. పధకం ప్రారంభ సమయములో వివిధ కారణాలతో 2020-21 సంవత్సరానికి ధరఖాస్తు చేసుకోలేక పోయిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఒక నెల లోపు దరఖాస్తు చేసుకొనే అవకాశము కల్పించారని, ఆ క్రమంలోనే రెండో విడత పంపిణీలో భాగంగా రూ.21.37 కోట్లు పంఫిణీ చేసామని వివరించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు నాగేశ్వరరావు, సంయుక్త సంచాలకులు కన్నబాబు, ఆప్కో జిఎం రమేష్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.
 
నేతన్నల యోగక్షేమాలు విచారించిన మేకపాటి
చేనేత కార్మికులతో చరవాణి ద్వారా మాట్లాడిన మంత్రి వారి యోగక్షేమాలను ఆరా తీసారు. పంపిణీ చేసిన నగదును ఎలా వినియోగిస్తున్నారన్న దానిని ప్రత్యేకంగా దృష్టి సారించిన మేకపాటి నగదు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా లబ్ది పొందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అని, ఇందుకోసం ఎన్ని నిధులైనా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని నేత కార్మికులకు వివరించారు. మరోవైపు జిల్లా స్థాయి అధికారులతో సైతం మేకపాటి సమావేశం అయ్యారు. లోటుపాట్లకు అవకాశం లేకుండా పధకం అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.