మొంథా తీవ్ర తుఫాను : చీరాల ఓడరేవులో రాకాసి అలలు... తీరంలో భారీగా కోత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాను అతలాకుతలం చేస్తుంది. ఈ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అలల ఉద్ధృతికి తీరంలో కొంతభాగం కోతకు గురైంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే అధికారులు బీచ్లను మూసివేశారు. పర్యాటకులను సోమవారం నుంచే పోలీసులు అనుమతించడం లేదు. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, మోటుపల్లి, చిన గంజాం సముద్రతీరాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను ప్రస్తుతం విశాఖకు దక్షిణంగా 280 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 190 కి.మీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 110 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న విషయం తెల్సిందే. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదులుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయవ్యంగా కదిలి.. మంగళవారం రాత్రిలోపు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
మొంథా తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయ. రాష్ట్రంలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుకు ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా బలపడింది. ఈ మేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ తుఫాను మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకు 270కి.మీ, విశాఖపట్నానికి 340 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని తెలిపింది.
ఇది మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. తుఫాను తీరందాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.