గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (16:14 IST)

సీబీఐ జోరు... వైకాపా బేజారు.. హూ కిల్ బాబాయ్ : ఆర్ఆర్ఆర్ ట్వీట్

raghuramakrishnamraju
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఆదివారం దూకుడు ప్రదర్శించి, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి సొంత మేనమామ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను పులివెందుల నుంచి హైదరాబాద్‌ నగరానికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఈ అరెస్టుపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. వచ్చే 48 గంటల్లో మరో అరెస్టు ఉండే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. "సీబీఐ జోరు.. మా వైకాపా బేజారు.. హూ కిల్ బాబాయ్" అంటూ వ్యాఖ్యానించారు. 
 
గొడ్డలితో హత్య చేసిన వారి అరెస్టు చేశారు. హత్యకు ముందు ఎవరెవరు కలిశారో.. ఎక్కడ కలిశారన్న కోణంలో విచారణ జరిగింది. గూగుల్ టేకౌట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని స్పష్టంగా తేలిపోయింది. మొన్న ఉదయకుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇపుడు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. మరో 48 గంటల్లో మరో ముఖ్యమైన అరెస్టు ఉంటుంది అని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. 
 
వివేకాను గొడ్డలితో నరికి చంపి గుండెపోటు అన్నారు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. ఫ్రీజర్‌లో పెట్టి రక్తం కనిపించకుండా పూలను కూడా ఏర్పాటు చేశారు అని అన్నారు. భాస్కర్ రెడ్డి స్వయంగా భారతీ రెడ్డిని మేనమామ. ఎంపీ సీటు ఎలాగూ అవినాశ్ రెడ్డికి ఖచ్చితంగా వస్తుందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చంపడమని ప్రశ్నించారు. ఈ హత్య కేసును టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిల మీదకు నెట్టేందుకు వైకాపా నేతలు శతవిధాలా ప్రయత్నించారు. వారు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారని ఆర్ఆర్ఆర్ గుర్తుచేశారు. 
 
ఇకపోతే, భాస్కర్ రెడ్డి అరెస్టు కావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి షాక్‌కు గురై ఉంటారని, ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఈ కేసుపై ఎక్కువగా మాట్లాడారని, ఇపుడు భాస్కర్ రెడ్డి అరెస్టుతో వైకాపా నేతలు నోరు మెదపడం లేదని ఆయన గుర్తుచేశారు. పైగా, నిజమైన దోషులు ఎవరన్నది సునీత రెడ్డికి తెలుసుని, అందువల్ల ఆమె ఇదే పట్టుదలతో ముందుకెళ్లి తండ్రి రుణం తీర్చుకోవాలని ఆమె పోరాటం మహిళా లోకానికి ఆదర్శమని రఘురామకృష్ణంరాజు గుర్తుచేశారు.