1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 22 జూన్ 2019 (16:34 IST)

నెయిల్ కట్టర్‌ను మింగిన ఏడు నెలల చిన్నారి....

గుంటూరు జిల్లా కేంద్రంలో ఏడు నెలల చిన్నారి ఒకరు ఆడుకుంటూ నెయిల్ కట్టర్‌ను మింగేసింది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు హూటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై తక్షణం స్పందించిన జీజీహెచ్ వైద్యులు అరుదైన చికిత్స ద్వారా నెయిల్ కట్టర్‌ను వెలికి తీసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మౌర్య రాజు, మౌర్య లక్ష్మీ అనే దంపతులు జీవనోపాధి కోసం గుంటూరుకు వలస వచ్చారు. వీరికి రజనీ అనే ఏడు నెలల చిన్నారి ఉంది. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇతర చిన్నారులు రజనీని ఆడిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నోట్లో నెయిల్‌ కట్టర్‌ పెట్టగా, అదేమిటో తెలియని చిన్నారి దానిని మింగేసింది. ఇతర పిల్లలు ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులకు చెప్పగా... వారు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై తక్షణం స్పందించిన వైద్యులు.. చిన్నారికి ఎక్స్‌రే, ఇతర వైద్య పరీక్షలు చేసి నెయిల్ కట్టర్‌ ఆహార వాహికలో నుంచి జారి జీర్ణాశయంలోకి చేరినట్లు గుర్తించారు. అయితే తక్షణమే ప్రమాదమేమీ లేదని పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. 
 
శుక్రవారం చిన్నారికి మత్తు మందు ఇచ్చి పీడియాట్రిక్‌ ఎండోస్కోపీ ద్వారా పొట్టలో ఉన్న నెయిల్‌ కట్టర్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం చిన్నారి రజనీని పీడియాట్రిక్‌ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతోందని వైద్యులు వెల్లడించారు.