శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (17:42 IST)

యువతకు సలహా ఇచ్చిన టాలీవుడ్ అగ్రహీరో

balakrishna
తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రహీరోగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన అభిమానులతో పాటు యువతకు ఓ మంచి సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి చూస్తూ కాలం వృథా చేయకుండా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఆయన గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలోభాగంగా పలు ప్రాంతాల్లో స్థానికులకు కలివిడిగా మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాల ఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలు ఉచితంగా ఎల్.ఈ.డి టీవీలను ఆయన ప్రధానం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు దేశానికి గుర్తింపు తెచ్చేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో అంధుల పాఠశాల, నవోదయ స్కూల్ తెచ్చిన ఘనత దివంగత ఎన్.టి.రామారావుకు చెందుతుందన్నారు.
 
ముఖ్యంగా, విద్యార్థులు చదువులపై దృష్టిసారించాలని కోరారు. సోషల్ మీడియా వైపు వెళ్లకుండా మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు చూడాలని, ఫేస్‌బుక్ విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కనీసం మట్టితో అయినా ఒక్క గుంత పూడ్చిన పాపానపోలేదని ఆయన ఆరోపించారు.