శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (13:51 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాయంకానున్న బడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని బడులు మాయంకానున్నాయి. ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్స్‌లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విద్యావిధానంపై కొన్నిరోజుల క్రితం తొలి సమావేశం పెట్టినప్పుడు కేవలం 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్నే హైస్కూళ్లలో విలీనం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
 
ఉపాధ్యాయ సంఘాలకు కూడా అదే భావన కల్పించింది. దీంతో అంతమేరకే ఉంటుందేమే.. కొంతవరకే ఇబ్బందేమో..నని అంతా భావించారు. కానీ, సర్కారు ప్రకటనలోని అసలు గుట్టును విప్పుతూ.. ‘బడి మాయం’ పేరిట ఓ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇపుడు ఈ కథనం నిజమైంది. 
 
మంగళవారం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఈ సమావేశంలో అసలు విషయం బయటపెట్టారు. '3178 ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల లోపు ఉన్న 3,627 ప్రాథమిక పాఠశాలల్ని మ్యాపింగ్‌ చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో విలీనానికి కిలోమీటరు పరిధిలో ఉన్న మరో 8,417 పాఠశాలల్ని మ్యాపింగ్‌ చేశాం' అంటూ తాపీగా సెలవిచ్చారు. 
 
అంటే.. ఒక్కో ఉన్నత పాఠశాలకు... సుమారు నాలుగు పాఠశాలలను కలిపేస్తారు. ఈ లెక్కన కొన్ని ఊర్లలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నీ కలిసిపోతాయి. అంటే ఇక ఆవాసాల్లో, పిల్లలకు దగ్గరగా ప్రాథమిక పాఠశాలలు ఉండవు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో సగం హైస్కూళ్లలో కలిసిపోతాయి.