ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ నైట్ కర్ఫ్యూ.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు  
                                       
                  
				  				   
				   
                  				  కోవిడ్ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. వైద్య ఆరోగ్య శాఖపై  ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా కొత్త వైరస్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న విషయాన్ని అధికారులు వివరించారు. కోవిడ్ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు.
				  											
																													
									  
	 
	 
	కోవిడ్లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. దీని ప్రకారం హోం కిట్లో మార్పులు చేయాలన్నారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలన్నారు. అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
				  
	 
	 
	104 కాల్ సెంటర్ను సమర్ధంగా ఉంచాలని, ఎవరు కాల్ చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ కేర్ సెంటర్లను కూడా సిద్ధం చేయాలని, నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	 
	కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజలు భౌతిక దూరం పాటించేలా, మాస్క్లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్లు ధరించకపోతే జరిమానా విధించాలని, దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్డోర్స్లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశించారు.
				  																		
											
									  
	థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని,  మాస్క్తప్పనిసరి చేయాలన్నారు. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ ఉంచాలని సీఎం ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలన్నారు. సీఎం సూచనల మేరకు మార్గదర్శకాలను  వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేయనుంది.