మళ్లీ ఘోర ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్.. బస్సు నుజ్జు నుజ్జు.. ఏమైంది?
కావేరి ట్రావెల్స్ బస్సు మరోసారి ప్రమాదానికి గురైంది. గతంలో కర్నూలు వద్ద సంభవించిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు.
తాజాగా ఎన్డీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద కావేరి బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. నందిగామ బైపాస్ అనాససాగరం వద్ద ఫ్లై ఓవర్పై కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని బస్సు ఢీ కొట్టింది.
హైదరాబాద్ నుంచి వైజాగ్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బస్సు నుజ్జు నుజ్జు అయ్యింది. బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే నందిగామ ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.