మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

మిస్టర్ జగన్.. నువ్వో క్రిమినల్‌వి.. : పవన్ కళ్యాణ్ ధ్వజం

pawan kalyan
ఏపీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌ను ఒక ముఖ్యమంత్రిగా ఇంతకాలం గౌరవిస్తూ వచ్చిన ఆయన.. ఇపుడు ఏక వచనంతో సంభోధించారు. పైగా, జగన్‌పై నిప్పులు చెరిగారు. నువ్వు క్రిమినల్‌వి జగన్... మా దురదృష్టం కొద్దీ మాకు ముఖ్యమంత్రివి అయ్యావు... ఎస్సెని కొట్టిన నువ్వు డీజీపీని, పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఛీ అనిపిస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వ మారడమే ఆలస్యం... ప్రతి తప్పు బయటకు తీస్తాం.... నిన్ను ఊరూరా తిప్పి ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పేలా చేస్తాం అని పవన్ స్పష్టం చేశారు. 'మాట్లాడితే చాలు... ఈ జగన్ నేను హైదరాబాదులో ఉన్నానని అంటాడు. జగన్... నేను మీ నాన్నలా ప్రాజెక్టుల మీద 6 శాతం కమీషన్ దోచుకోలేదు. సీఎం పదవి చాటున వేల కోట్లు దోచుకోలేదు. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను జగన్. సినిమాల్లో సంపాదించిన డబ్బును కౌలు రైతులు ఖర్చు పెడుతున్నాను' అని స్పష్టం చేశారు.
 
అసలు, ఈ ముఖ్యమంత్రి ప్రెస్మీట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 'ప్రశ్నిస్తారనే ప్రెస్మీట్లు పెట్టడంలేదు. ఓ రాణిలా పరదాల చాటున దాక్కుని వెళతాడు. ముఖం చూపించకుండా ఉండడానికి నువ్వేమైనా రాణివా? అలాంటప్పుడు ఇక్కడెందుకు... వెళ్లి ఇడుపులపాయలో కూర్చో. ఏ గ్రామానికి వెళ్లవు, అలాంటప్పుడు నువ్వు తాడేపల్లిలో ఉంటే ఏంటి, దాచేపల్లిలో ఉంటే ఏంటి?' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
పైగా, తానేమీ సరదాగా రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను ఇన్ని బాధలు, అవమానాలు ఎందుకు పడాలి? గెలుపోటములతో పనిలేకుండా ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. అందరికీ సమన్యాయం అనే అంబేద్కర్ స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.
 
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మంచివాడా, చెడ్డవాడా అని చూడకుండా, సీఎం స్థానానికి విలువ ఇచ్చి జగన్ రెడ్డి గారు అని గౌరవించానని తెలిపారు. అయితే, ఈ రోజు నుండి అంబేద్కర్ సాక్షిగా జగన్ రెడ్డిని ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని వ్యాఖ్యానించారు. అతడి పార్టీ వైసీపీ రాష్ట్రానికి సరైనది కాదని అన్నారు. 2024లో జగన్, వైసీపీ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు.
 
'మనమేమీ వైఎస్ జగన్‌కు బానిసలం కాదు... ఆయన కూడా మనలో ఒకడే. మనం ట్యాక్సులు కడితే ఆ డబ్బుతో పాలన చేసే వ్యక్తి. సీఎం అంటే కేవలం జవాబుదారీ మాత్రమే' అని వివరించారు. "ఈ జగన్ ఎలాంటివాడంటే... నేను ఏం మాట్లాడినా వక్రీకరించి, వంకరగా, వెకిలిగా మాట్లాడతాడు. నేను ఏం మాట్లాడినా అది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. కానీ ఈ వైసీపీ నేతలు ఏ సంబంధంలేని నా భార్యను, రాజకీయాలు తెలియని నా తల్లిని తిడుతున్నారు. నేను ప్రజల కోసం మాట్లాడుతుంటే, వారు నా కుటుంబాన్ని, ఇంట్లోని ఆడవాళ్లను తిడుతున్నారు" అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.