1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (13:33 IST)

కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వివాదాస్పదమవుతుంది. తాజాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీవో కూడా జారీచేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26కు పెరగనున్నాయి. అయితే, ఈ జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 
 
గుంటూరు జిల్లాకు చెందిన దొంతినేని విజయకుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెజ్జి సిద్ధార్థం, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామరావులు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రపతి ఆమోదముద్ర లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యంకాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం విభజన చట్టంలో గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు గుర్తుచేశారు. ఈ జిల్లాల విభజన గతంలో చేపట్టిన ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఈ పిటిషన్లంటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది.