శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (22:06 IST)

పోలవరం పనులకు ఆటంకం రాకూడ‌దు.. అక్టోబ‌రు నాటికి అవుకు ట‌న్నెల్‌-2 ప్రారంభానికి సిద్ధం: జ‌గన్‌

వ‌ర్షాకాలంలోనూ పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌కు అంత‌రాయం లేకుండా ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా ప‌నిచేయాల‌ని ఏపి సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అదే క్ర‌మంలో చెల్లింపులు పోగా.. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.3791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్‌ పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ ఏడాది ప్రారంభించనున్న 6 ప్రధాన ప్రాజెక్టులపై సీఎం జ‌గ‌న్ గురువారం తాడేప‌ల్లిలోని త‌మ విడిది కార్యాల‌యం నుంచి సమీక్ష నిర్వ‌హించారు.

అక్టోబరులో అవుకు టన్నెల్‌–2, వెలిగొండ మొదటి టన్నెల్, నెల్లూరు, సంగం బ్యారేజీల ద్వారా సాగునీరు. వంశధార నాగావళి లింక్‌ ద్వారా డిసెంబరులో నీటి విడుదల. నవంబరులో పోలవరం గేట్ల బిగింపునకు ప్రయత్నాలు. వర్షా కాలంలోనూ ప్రణాళికా బద్ధంగా అంతరాయం లేకుండా పోలవరం పనులకు సీఎం ఆదేశించారు.

గత ఏడాది గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని ముమ్మరంగా పునరావాస పనులకు ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, సీఎస్‌ నీలం సాహ్ని, జలవనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు హాజర‌య్యారు.

ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్‌–2, వెలిగొండ ప్రాజెక్టులో హెడ్‌ రెగ్యులేటర్‌ వర్క్స్, టన్నెల్‌–1 పనులు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టులో ఫేజ్‌ –2లో స్టేజ్‌–2 పనులపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.

అవుకు టన్నెల్‌ –2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు వెల్ల‌డించారు. నల్లమలసాగర్‌ పూర్తయ్యిందని, ఆర్‌ అండ్‌ ఆర్‌కూ అన్ని రకాల అనుమతులు వచ్చాయని, నల్లమలసాగర్‌ నుంచి ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌కు వెళ్లే 180 మీటర్ల టన్నెల్‌ పనులు కూడా మరో 3 నెలల్లో పూర్తవుతాయని, తీగలేరు కెనాల్‌కు వెళ్లే 600 మీటర్ల టన్నెల్‌ పనులు కూడా పూర్తవుతున్నాయని వెల్లడించిన అధికారులు నాలుగు నెలల్లో టన్నెల్, కాల్వ పనులు పూర్తి చేస్తామని సీఎం జ‌గ‌న్‌కు ‌వెల్ల‌డించారు. 
 
నెల్లూరు బ్యారేజీ..
పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, అందువల్ల రెండు నెలల్లో సివిల్‌ వర్క్స్‌ పూర్తి చేస్తామన్న అధికారులు. అక్టోబరు చివరి నాటికి పనులు పూర్తి అవుతాయని వెల్లడి.  సంగం బ్యారేజీ పనులు కూడా అక్టోబరు చివరి నాటికి పూర్తవుతాయని అధికారులు వెల్ల‌డించారు. 
 
పోలవరం ప్రాజెక్టు..
రేడియల్‌ గేట్స్‌ ఫ్రాబ్రికేషన్‌ చేసుకుని నవంబరు నుంచి అమర్చుతామని, మిగిలిన వాటి పనులు కూడా ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఏప్రిల్‌లో 3 వేల మంది కూలీలు ఉంటే.. కోవిడ్‌ కారణంగా 900 మంది మాత్రమే పనుల్లో ఉన్నారని, మళ్లీ వారందర్నీ పిలిపిస్తున్నామని, ప్రస్తుతం 2 వేల మంది కూలీలు పని చేస్తున్నారని అధికారులు వెల్ల‌డించారు.

స్పిల్‌వేలో 52 పిల్లర్లు గతంలో సరాసరిన 28 మీటర్లు ఎత్తున ఉంటే.. ప్రస్తుతం 47.44 మీటర్లు ఎత్తుకు చేరుకున్నాయని సీఎంకు వెల్లడించారు.

వర్షపు నీరు వచ్చే సమయంలో కూడా చేసుకోదగ్గ పనులు చేసుకోవాలన్న సీఎం, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు. స్పిల్‌ వే పూర్తయిన తర్వాత గేట్లను నవంబరు నుంచి బిగించాల్సి ఉంటుంది కాబట్టి, ఆలోగా గేట్ల ఫాబ్రికేషన్‌ అయ్యేలా చూడాలి. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం మిగిలిపోయిన భూసేకరణ, పునరావాస పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.