1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (18:01 IST)

"పేదల నుంచి ధనవంతులు" కాన్సెప్టును ఆవిష్కరించిన చంద్రబాబు

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పూర్ టు రిచ్ అనే కాన్సెప్టును ప్రారంభించారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఆయన గురువారం పర్యటించారు. గ్రామంలోని ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేదరిక నిర్మూలనకు టీడీపీ మినీ మేనిఫెస్టోలో పెట్టిన 'పూర్‌ టు రిచ్‌' అనే పేరుతో కొత్త కాన్సెప్ట్‌ను ప్రయోగాత్మకంగా ఆవిష్కరించి లక్ష్యాలను వివరించారు. 
 
ఈ పథకంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాలను ఎంపిక చేసినట్టు చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సహకారం అందిస్తామన్నారు. సంపద సృష్టించి అది పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. 
 
'నిమ్మకూరు గ్రామంలో 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కానీ, వ్యవసాయం చేసేది 80 మంది మాత్రమే. చాలా మంది వలస వెళ్లారు. గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. వారంతా స్వగ్రామంలో కుటుంబాలను బాగు చేసే బాధ్యత తీసుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత అందించాలి. ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు అన్వేషించాలి. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలి. ఇది ఆరంభం మాత్రమే. అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు సాగుతాం' అని తెలిపారు.