1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (10:39 IST)

దిశా చట్టం అమలుకు సర్వం సన్నద్దం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక దిశా చట్టం అమలుకు సర్వం సన్నద్దం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకి  అనుగుణంగా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు.

రాష్ట్రంలోని మహిళా మిత్రలను ఇన్వెస్టిగేషన్ టీంలలో భాగస్వాములను చేసే కార్యక్రమానికి విజయవాడ నుంచి శ్రీకారం చుట్టారు. నిబద్దతతో పనిచేసి మహిళా సంరక్షణను కట్టుదిట్టం చేస్తామని దిశా స్పెషల్ అధికారి కృతికా శుక్లా తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘దిశా చట‍్టంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను చేపడతాం. మహిళామిత్రలతో పాటు గ్రామ సంరక్షణ మహిళా కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉంటుంది. జనవరి నెలాఖరుకు దిశా సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం.

అలాగే దిశా సెంటర్ల కోసం నియమించిన పోలీస్‌, వైద్య విభాగాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం. వెలగపూడి, తిరుపతిలో ఈ నెల 17,18 తేదీల్లో శిక్షణ ఉంటుంది. వన్‌ స్టాప్‌ సెంటర్‌ల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెడతాం’ అని తెలిపారు.

దిశా స్పెషల్ ఐపీఎస్ అధికారి దీపికా పాటిల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆలోచనలకి అనుగుణంగా దిశా చట్టాన్ని అమలు చేస్తాం. రాష్ట్రంలో పద్దెనిమిది దిశా సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నాం. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దిశా సెంటర్లు పని చేస్తాయి.

ఈ చట్టంతో రాష్ట్రం లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పడబోతోంది. అన్నీ ఒకచోట కేంద్రీకృతం కానుండటంతో చట్టం అమలు సులభతరం కానుంది. జీరో ఎఫ్ఐఆర్ కేసుల నమోదులో, బాధితుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తాం' అని స్పష్టం చేశారు.