శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (14:35 IST)

ఫీజు చెల్లించలేదని విద్యార్థులతో గోడకుర్చీ వేయించిన ప్రిన్సిపాల్ ... ఎక్కడ?

crime scene
స్కూలు ఫీజు చెల్లించనందుకు ఓ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ అత్యంత కఠినంగా నడుచుకున్నాడు. ఏకంగా 12 మంది విద్యార్థులతో గోడకుర్చీ వేయించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలోని ఓ కార్పొరేట్ ప్రైవేటు స్కూలులో జరిగింది.
పట్టణంలోని పుల్లారెడ్డి నగరులో ఉన్న ఈ స్కూలులో 12 మంది విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. 
 
అయితే, మంగళవారం వారిని ప్రత్యేకంగా ఒక గదిలోకి రప్పించి, 'మీరు ఫీజులు చెల్లించలేదు. మీ తల్లితండ్రులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు. వేరే నెంబర్ల నుంచి మీరే ఫోన్ చేసి ఫీజులు కట్టాలని చెప్పండి. లేదంటే తరగతులకు హాజరు కానివ్వడం లేదని చెప్పండి' అంటూ విద్యార్థులతో ప్రిన్సిపాల్ లేఖా సురేశ్ ఫోన్లు చేయించారు. 
 
దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఒక గదిలో దోషులుగా నిలబెట్టి ఉంచడం చూసి తట్టుకోలేకపోయారు. అక్కడున్న వారిని నిలదీయగా, ఈలోపు బ్రాంచ్ 3 ప్రిన్సిపాల్ శైలేశ్ అక్కడకు చేరుకుని తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగారు. 
 
'ఫీజులు కట్టలేనప్పుడు మీ పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివించడం ఎందుకు?' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. వెంటనే మీడియా కూడా అక్కడకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
ఇలాంటి చర్యల వల్ల తమ పిల్లల మనోభావాలు దెబ్బతింటాయని, పది మందిలో తమకు అవమానం జరిగిందన్న మాన క వేదనకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు మండిపడ్డారు.