శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:40 IST)

పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామన్న 'నందిగం' ... ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్'

వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీకి చెందిన ఎంపీ నందిగం సురేష్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. పైగా, తనను ఎంపీ నందిగం సురేష్ పరుష పదజాలంతో దూషించిన ఆడియో టేపును కూడా అందజేశారు. 
 
గత కొంతకాలంపై వైకాపా నేతలకు రఘురామకృష్ణంరాజుకు ఏమాత్రం పొసగని విషయం తెల్సిందే. దీంతో సీఎం జగన్ ప్రభుత్వాన్ని సందర్భం చిక్కినపుడల్లా రఘురామరాజు విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ ఇంతకుముందే లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
ఇదిలావుండగా, గురువారం పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ పై ఓం బిర్లాకు రఘురామకృష్ణరాజు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. మీడియాతో సురేశ్ మాట్లాడుతూ తనను దుర్భాషలాడారని, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని తన నోటీసులో పేర్కొన్నారు. దీంతో పాటు మీడియాతో సురేశ్ మాట్లాడిన వీడియో ఫుటేజీని కూడా స్పీకర్ కు అందజేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
 
అంతకుముందు అంటే బుధవారం వైకాపాకు చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ, రఘురాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ సీఎంను, ఎంపీలకు ఉద్దేశించి పిచ్చి వాగుడు వాగితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని హెచ్చరించారు. తమ ఎంపీ మిథున్ రెడ్డికి నాలుగు ఓట్లు కూడా పడవని రఘురాజు అంటున్నారని... మోసగాడు, చీటర్ వంటి పదవులకు పోటీ పడితే రఘురాజుకు ఎంపీల ఓట్లన్నీ పడతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే స్పీకర్‌కు రఘురాజు ఫిర్యాదు చేశారు.