1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (12:11 IST)

ఏపీకి అప్పులిచ్చేవారు ఒక్కరంటే ఒక్కరు లేరు : రఘురామరాజు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైకాపాకు చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరో లేఖ రాశారు. న‌వ సూచ‌న‌లు - విధేయ‌త‌ పేరుతో రాసిన ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. 
 
కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించిన తర్వాత కూడా 18 సంవత్సరాలు నిండినవారికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ అమలు కావడంలేదని గుర్తుచేశారు. దీంతో విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్‌కు సూచిస్తున్నానని తెలిపారు.
 
మరోవైపు, దేశంలో కరోనా రెండో ద‌శ విజృంభ‌ణ‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందచేస్తామని ప్రకటించిందని ర‌ఘురామ అన్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ వ్యాక్సిన్ అందచేశారని ఆయ‌న చెప్పారు. ఏపీలోనూ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కోరారు.
 
అదేసమయంలో ఏపీకి అప్పులిచ్చేవారు ఎవ‌రూ లేర‌ని ర‌ఘురామ‌ చుర‌క‌లంటించారు. ఏపీలో కనీసం మంచి వైద్యులైనా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర‌ మెడికల్ కౌన్సిల్‌, ఏపీ హెచ్ఎంహెచ్ఐడీసీలకు అధిపతులుగా స‌రైన‌ అనుభవం లేని ఇద్దరు తెలంగాణ వైద్యులను నియమించారని గుర్తుచేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వైద్యుల నియామకం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇలాంటి వైద్య సంబంధిత సంస్థలకు అధిపతులుగా ఇత‌ర‌ రాష్ట్రాల వైద్యులను కాకుండా సొంత రాష్ట్ర‌ పరిస్థితులు తెలిసిన స్థానిక వైద్యులను నియమించాలని జగన్‌కు రఘురామరాజు సూచించారు.