1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. simhadri appanna chandanotsavam 2025 - 8 pilgrims die in simhadri chandanotsavam tragedy

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

simhadri appanna
విశాఖపట్టణం జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 300 రూపాయల టిక్కెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. 
 
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. మంగళవారం అర్థరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టిక్కెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోయింది. 
 
ఆ వెంటనే సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోం మంత్రి అనిత, విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సింహాచలం శ్రీరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగానే గోడ కూలిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సింహాచలంలో పరిస్థితిపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్టు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. 
తర్వాతి కథనం
అత్యాచారం చేసిన బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. అయినా జైలులోనే...