ఆదివారం, 30 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మార్చి 2025 (10:32 IST)

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

suicide
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికాలేదని ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడుని పురోహిత్ కిషోర్ (34)గా గుర్తించారు. ఈ విషాదకర ఘటన అల్వాల్ బస్తీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ మాల్‌ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్‌ ఎంబీబీఎస్ వైద్యుడుగా అల్వాల్ బస్తీ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. కిషోర్‌కు కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. 
 
అయితే, కిషోర్‌కు బట్టతల ఉండటంతో పాటు ఇతర కారణాల రీత్యా ఆ నిశ్చితార్థం కాస్త రద్దు అయింది. ఆ తర్వాత అనేక సంబంధాలు చూస్తున్నా వాటిలో ఏ ఒక్కటీ కుదరలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్... బుధవారం ఉదయం తన ద్విచక్రవాహనంపై బొల్లారం రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకుని అక్కడ వాహనాన్ని పార్క్ చేశాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న క్వావలరీ బ్యారక్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకుని నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి వస్తున్న హుజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. 
 
రైలు లోకోపైలెట్ ఈ విషయాన్ని గుర్తించి, జీఆర్పీ పోలీసులకు సమాచారాన్ని తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని వద్ద ఉన్న గుర్తింపు కార్డులోని చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.