గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 26 జులై 2021 (10:19 IST)

చెంచు కుటుంబాల‌కు సోము వీర్రాజు ప‌రామ‌ర్శ‌

భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర వ్యాప్త ఆలయాల సందర్శన‌ యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. రావీడు మండలం, రాజంపల్లి చెంచు గూడెంలో  హ‌త్యాయత్నం, దాడికి గురైన చెంచు కుటుంబాలను ఆయ‌న పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల వంశీకృష్ణ జరిగిన సంఘటనను సోము వీర్రాజుకు  వివరించారు.
 
కాలనీలో 60 సెంట్ల స్థలం ఖాలీగా ఉండగా, గిరిజన పాఠశాల, అంగనవాడి కేంద్రం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపారు. కాని పాశం నాగేశ్వరరావు,పాశం తిమ్మయ్య,కుందూరు నాగిరెడ్డి, కాసు శ్రీనివాసుల రెడ్డి, మ‌రి కొంత మంది దౌర్జన్యంగా సంబందించిన స్థలాన్ని కబ్జా చెయ్యాలని ప్రయత్నించగా, స్థానిక గూడెం కు చెందిన చెంచులు అడ్డుకున్నారు.

ఆ  అక్కసుతో జూన్ 10 న రాత్రి పూట విద్యుత్ నిలిపివేసి కత్తులు, రాడ్లు,గొడ్డళ్లు  బీరు బాటిల్లు తీసుకొని విచక్షణారహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసారని ఆరోపించారు. ఈ దాడిలో జల్లా సాయి కి తీవ్రగాయాలు అయ్యి బ్రెయిన్ ఆపరేషన్ జరిగి రెండు నెలలుగా ఆసుపత్రిలోనే చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడని వివ‌రించారు.

జళ్లా వెంకటేశ్వర్లు తలకు కంటికి బలమైన గాయాలు అయ్యాయని, జల్లా ఆదిలక్ష్మి కి కాలు నరం తెగిందని చెప్పారు. కానీ, పోలీసులు తూతూ మంత్రంగా ఎస్టీ అత్యాచార నిరోధక కేసును నమోదు చేసి 307 సెక్షన్ కట్టాల్సి వుండగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని ఆరోపించారు. సంఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా ఎలాంటి విచారణ పోలీసులు చేపట్టలేదని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వివరించారు. 
 
సోము వీర్రాజు రాజం పల్లిని సందర్శించి బాధితులతో మాట్లాడిన తరువాత, ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ, డిఎస్పీ లతో ఫోన్లో మాట్లాడి హత్యాయత్నం జరిగితే బెయిల్ బుల్ సెక్షన్ లు ఎలా పెడతారని  నిలదీశారు. సెక్షన్ లు మార్చి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే బిజెపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని,నేషనల్ ఎస్టీ కమీషన్ కి మీపై పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల వంశీకృష్ణ మరియు గిరిజనమోర్చ జిల్లా అధ్యక్షులు సిరసనగండ్ల శ్రీనివాస్ నాయకత్వం వహించి రాజంపల్లి ఆర్చ్ దగ్గర నుండి కాలనీ వరకు సోము వీర్రాజుకు బిజెపి కార్యకర్తలతో కలసి పూలతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో  బిజెపిగిరిజన మోర్చ  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆమని వసుంధర,బి.వెంకటేశ్వర నాయక్,నరసరావుపేట పార్లమెంట్ గిరిజన మోర్చా ఇంచార్జీ పొన్నర్స్ సుబ్బారావు, ప్రకాశం జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు కొమర గిరి  ఏడుకొండలు,ప్రధానకార్యదర్శి ఏలూరి శ్రీనివాసులు,చెంచు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కెం కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.