1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (07:11 IST)

రేపు శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవం

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవం శనివారం ఆ వర్సిటీలోని వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో జరగనుంది. వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో రాష్ట్ర గవర్నరు విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడలోని రాజ్‌భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.

ముఖ్య అతిథిగా ఎన్‌డీఆర్‌ఐ మాజీ వీసీ డాక్టర్‌ ఏకే శ్రీవాస్తవ పాల్గొంటారు. ఈ స్నాతకోత్సవంలో గతేడాది జనవరి ఒకటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు వర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసిన 426మందికి పట్టాలు ప్రదానం చేయనున్నారు.

యూజీలో 288 మందికి (వెటర్నరీలో 235, డెయిరీటెక్నాలజీ 14, ఫిషరీసైన్స్‌ 39), పీజీలో 102మందికి (వెటర్నరీలో 89, డెయిరీలో 3, ఫిషరీలో 10), పీహెచ్‌డీలో 36మందికి (వెటర్నరీలో 34, ఫిషరీలో ఇద్దరికి) డిగ్రీలు ఇస్తారు. 37మందికి బంగారు పతకాలు (యూజీలో 28, పీజీలో ఏడుగురు, పీహెచ్‌డీలో ఇద్దరు), ఇద్దరికి రజితం, ఒకరికి నగదు బహుమతి అందిస్తారు.

వర్సిటీ చరిత్రలో మొదటిసారిగా ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో యూజీ పూర్తిచేసిన డాక్టర్‌ కె.తులసిరుక్మిణి 11 బంగారు పతకాలు అందుకోనున్నారు. ‘బెస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ రిలివెంట్‌ టు ది ఫార్మింగ్‌ కమ్యూనిటీ’ కింద 2020కి గన్నవరంలోని ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.చంద్రప్రసాద్‌కు ముప్పవరపు ఫౌండేషన్‌ గోల్డ్‌మెడల్‌ అందించనున్నారు.

అనిమల్‌ న్యూట్రిషన్‌ విభాగంలో బెంగళూరుకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అనిమల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ ఫిజియాలజీ (ఎన్‌ఐఏఎన్‌పీ) మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కేటీ సంపత్‌కు ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆంజనేయప్రసాద్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు బహూకరించనున్నారు.

అదేవిభాగంలో ఆలిండియా స్థాయిలో మాస్టర్‌ రీసెర్చ్‌(పీజీ)లో డాక్టర్‌ ప్రతాప్‌ వి రెడ్డి అవుట్‌స్టాండింగ్‌ రీసెర్చ్‌ అవార్డును లుథియానాలోని గురుఅంగద్‌దేవ్‌ వెటర్నరీ అండ్‌ అనిమల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి డాక్టర్‌ ప్రబ్‌జిందర్‌సింగ్‌కు అందించనున్నారు.