1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (18:56 IST)

ముగ్గురి కబంధహస్తాల్లో రాష్ట్రం: కాల్వ శ్రీనివాసులు

ప్రతిపక్షానికి ఉండే అనుమానాలు, సందేహాలను వ్యక్తం చేయడం, తమ భావవ్యక్తీకరణను విపక్షాల వారు తెలియచేయడం సహజంగా జరిగేదేనని, దానిలో భాగంగా టీడీపీఅధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

మాపార్టీ ముఖ్యులు మాట్లాడుకున్న అంశాలు వైసీపీవారికి చేరుతున్నట్లు తాము గ్రహించబట్టే చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలని లేఖద్వారా ప్రధానిని కోరడం జరిగిందన్నారు. ఆయన లేఖపై వైసీపీ పెద్దలు ఎందుకింతలా ఉలిక్కి పడుతున్నారో తెలియడంలేదని, వారంతా తమ భుజాలతోపాటు జగన్ భుజాలు కూడా తడుముతున్నారని కాల్వ ఎద్దేవాచేశారు.

ఫోన్ ట్యాపింగ్ తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు, వారెందుకు అతిగా స్పందిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు గతంలో అనేకఅంశాలపై ఫిర్యాదులు చేయడం, లేఖలు రాయడం జరిగిందని, వాటిని ఏనాడూ కనీసం పరిశీలించని ప్రభుత్వం, ప్రధానికి రాసిన లేఖపై స్పందించడం ఏమిటని  శ్రీనివాసులు ప్రశ్నించారు. డీజీపీ గతంలో తాము చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, మాపార్టీనేతలను, కార్యకర్తలను వేధిస్తుంటే డీజీపీ ఏం చేశారన్నారు?

కొందరు పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తూ, చట్టాలను దుర్వినియోగం చేస్తుంటే డీజీపీ ఆనాడు ఎందుకు మాట్లాడలేదన్నారు.  వైసీపీ నేతలు నిందితులుగా ఉన్నకేసుల్లో కనీసం వారిని విచారించడం లేదని, టీడీపీ వారిపై మాత్రం అనేకరకాలుగా వేధిస్తున్నారన్నారు. అందుకు పెద్ద ఉదాహరణ అచ్చెన్నాయుడి ఉదంతమేనని కాల్వ తెలిపారు. ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడుకి ఎలాంటి నగదు అందలేదని, ఆయన ప్రమేయం ఉన్నట్లుగా తమకు ఆధారాలు లభించలేదని ఏసీబీ అధికారే చెప్పారన్నారు.

ఆర్థికప్రయోజనం అచ్చెన్నాయుడు పొందనప్పుడు, ఆయన్ని అరెస్ట్ చేయడానికి వందల మంది పోలీసులు వెళ్లడం, వందలకిలోమీటర్లు ప్రయాణం చేయించడం, ఆయనకు కరోనా రావడానికి ఎవరు కారుకులోసమా ధానం చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయమన్న ముఖ్యమంత్రా, అరెస్ట్ ను పర్యవేక్షించిన ఉన్నతాధికారులా, దారుణంగా అరెస్ట్ చేసిన అధికారులు బాధ్యత తీసుకుంటారో సమాధానం చెప్పాలన్నారు.

అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యానికే పాతరేసినట్లుగా ఉందని కాల్వ వాపోయారు. వైసీపీఅధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకుంటూ, వ్యవస్థలను నిర్వీర్యం చేసింది నిజంకాదా అని శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను పాశవికంగా అణచివేసే పనులు చేస్తూనే, రాజ్యాంగబద్ధ సంస్థల అధిపతులను, న్యాయమూర్తులను భయపెట్టి, నిష్పక్షపాతంగా వారుతమ విధులు నిర్వర్తించకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి ప్రతినిధులుగా నియమితులైన విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల కబంధహస్తాల్లో ప్ర్రభుత్వం బందీగా మారిందని, వారే ప్రభుత్వాన్ని వెనకనుండి నడిపిస్తూ, రాజ్యాంగేతర శక్తులుగా మారారని మాజీమంత్రి దుయ్యబట్టారు. తన ఫోన్ ని చంద్రబాబు ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని గతంలో తప్పుడు ఆరోపణలతో హైకోర్టుకి వెళ్లిన సజ్జల రామకృష్ణారెడ్డి, విచారణ సమయంలో ఎందుకు కోర్టుకు హజరుకాలేదో చెప్పాలని కాల్వ డిమాండ్ చేశారు.

పిటిషన్ దారు విచారణకు రావడానికి ఆసక్తి చూపడంలేదని, వాయిదాలకు హాజరుకావడం లేదని అందువల్ల పిటిషన్ (4237 / 2019) ను కొట్టేస్తున్నామని హైకోర్టు చెప్పింది వాస్తవం కాదా అని మాజీమంత్రి ప్రశ్నించారు. ఇదేవిధంగా వై.వీ.సుబ్బారెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి 2019 డిసెంబర్ లో ఉపసంహరించుకు న్నాడన్నారు.

ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి సంబంధం లేదని చెబుతున్నవారు పైన చెప్పిన పిటిషన్లలో ప్రతివాదులుగా కేంద్రప్రభుత్వశాఖల్లోని అధికారులే ఉన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కర్ణాటకలో బీజేపీ ఎంపీ, రాజస్థాన్ లో బీజేపీ వాళ్లు ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రప్రభుత్వ దర్యాప్త ను కోరింది నిజం కాదా అని కాల్వ నిలదీశారు.

చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖ తప్పని చెప్పడానికి కొందరు ఢిల్లీలో, తాడేపల్లిలో, హైదరాబాద్ లో  మాట్లాడుతున్నారని, వారందరూ చదివే స్క్రిప్ట్ మొత్తం తాడేపల్లి నుంచే వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేస్తే ఏపీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటో చెప్పాలని కాల్వ డిమాండ్ చేశారు.

అనుమానితుల ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఉన్నప్పుడు, ప్రభుత్వం నిర్దేశిత నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, అలా కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కుట్రలకు తెరలేపడం మంచిదికాదన్నారు. ఒక ప్రభుత్వంపై ఇటువంటి ఆరోపణలు రావడం, దర్యాప్తు జరపమని కోరే పరిస్థితులు వచ్చాయంటే, ఆ ప్రభుత్వం నైతికంగా పతనమైనట్టేనని కాల్వ తేల్చిచెప్పారు. 

ప్రజలకోసం, వారి సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఎప్పుడూ వెనుకాడదని, ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేయాలని చూసినా తాము ముందుకే వెళతామని ఆయన తేల్చిచెప్పారు.